పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోంది: కృష్ణాబోర్డుకు తెలంగాణ మరో లేఖ

Telangana writes another letter to krishna river board against AP
  • ఆగస్టు 7 నాటికి 10.48 టీఎంసీల బదులు 25 టీఎంసీలు తరలించింది
  • అంతర్రాష్ట్ర ఒప్పందాలను ఏపీ ఉల్లంఘిస్తోంది
  • నీటిని తరలించేందుకే విద్యుదుత్పత్తిని ఆపమంటోంది
ఏపీ, తెలంగాణ మధ్య రాజుకున్న జలవివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తాజాగా మరో లేఖ రాసిన తెలంగాణ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ అనధికారికంగా నీటిని తరలిస్తోందని ఆరోపించింది. వెంటనే దీనిని నిలువరించాలని కోరింది. ఆగస్టు 7 నాటికి 10.48 టీఎంసీలు తరలించాల్సి ఉండగా ఏకంగా 25 టీఎంసీలు తరలించిందని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలోని అంతర్రాష్ట్ర ఒప్పందం, ప్రణాళికా సంఘం ఆమోదం ప్రకారం.. జులై నుంచి అక్టోబరు మధ్య  చెన్నైకి తాగునీటి కోసం 15 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీలను మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించాల్సి ఉండగా, ఏపీ దీనిని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. గత రెండేళ్లలో వరుసగా 179, 129 టీఎంసీలను తరలించిందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. నీటిని అక్రమంగా మళ్లించేందుకే శ్రీశైలం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా నిలిపివేయాలని కృష్ణా బోర్డును ఏపీ కోరిందన్నారు. తెలంగాణలోని సాగు, తాగునీరు, భూ స్వరూపం, విద్యుదుత్పత్తి తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని తరలించకుండా అడ్డుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Krishna river board

More Telugu News