మేం యుద్ధమంటూ చేయాల్సి వస్తే తీవ్ర పరిణామాలు: రష్యా, చైనాలకు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక

Biden Warns Russia and China Over War
  • సైబర్ దాడులే దానికి కారణమవుతాయి
  • అది ఇక్కడితోనే అంతమవ్వాలని కామెంట్
  • చైనాతో ముప్పు పొంచి ఉందన్న బైడెన్
శక్తిమంతమైన దేశాలతో అమెరికా యుద్ధమంటూ చేయాల్సి వస్తే.. దానికి సైబర్ దాడులే కారణమవుతాయని దేశాధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యా, చైనా నుంచి ఇటీవలి కాలంలో సైబర్ దాడుల ప్రమాదాలు పెరిగిపోయాయని ఆయన చెప్పారు. ఇటీవల ఓ నెట్ వర్క్ మేనేజ్మెంట్ సంస్థ సోలార్ విండ్స్, కాలనియల్ పైప్ లైన్ కంపెనీ, మాంసం శుద్ధి సంస్థ జేబీఎస్, సాఫ్ట్ వేర్ కంపెనీ కసేయాలపై సైబర్ దాడులు జరిగాయి. దీంతో కొన్ని చోట్ల ఇంధనం, ఆహార సరఫరా ఆగిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ విషయాన్ని బైడెన్ తీవ్రంగా పరిగణించారు. అది ఇక్కడితోనే అంతమవ్వాలని, అలాకాకుండా తాము యుద్ధానికి దిగాల్సి వస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించారు. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసును సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతోనూ అమెరికాకు ముప్పు పొంచే ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న చైనా.. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. నిఘా సంస్థల అధికారులు, సిబ్బందిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండవని ఆయన హామీ ఇచ్చారు.
Go Back to Shorts
USA
Joe Biden
Russia
China

More Telugu News