రూ. 300 ఖర్చుతో ఇంట్లోనే కొవిడ్ పరీక్ష.. టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్

  • ‘కొవిహోమ్’ కిట్ సామర్థ్యాన్ని పరీక్షించిన సీసీఎంబీ-సీఎస్ఐఆర్
  • అరగంటలోనే కచ్చితమైన ఫలితం
  • దేశంలోనే తొలి ర్యాపిడ్ ఎలక్ట్రానిక్ కొవిడ్ టెస్టింగ్ కిట్
కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టింగ్ కోసం ఆసుపత్రులకు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే పరీక్ష చేసుకునే కిట్‌ను ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ‘కొవిహోమ్’ అని దీనికి పేరు పెట్టింది. ఇది దేశంలోనే తొలి ర్యాపిడ్ ఎలక్ట్రానిక్ కొవిడ్ టెస్టింగ్ కిట్. వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తే దీని ధర సుమారు రూ. 300 వరకు ఉండే అవకాశం ఉంది.

అనుమానితులు తమ గొంతు, ముక్కులోని స్రావాలను కిట్‌లోని ఎలక్ట్రానిక్ చిప్‌పై ఉంచితే 30 నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తోంది. అంతకంటే ముందు ఈ కిట్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. అందులోని ఐ-కొవిడ్ యాప్ ద్వారా అరగంటలోనే కచ్చితమైన ఫలితం వచ్చేస్తుంది.

దీని పనితీరును పరిశీలించిన సీఎస్ఐఆర్-సీసీఎంబీలు ఈ కిట్ 94.2 శాతం సామర్థ్యంతో, 98.2 శాతం నిర్దిష్టతతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. కొవిహోమ్ కిట్‌తో ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చని ఐఐటీ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి తెలిపారు. ఈ కిట్‌కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు.

IIT Hyderabad
CoviHome
COVID19
Testing Kit

More Telugu News