వైసీపీకి కత్తి మహేశ్ ప్రచారం చేస్తే.. జగన్ కనీసం సంతాపం కూడా ప్రకటించలేదు: మంద కృష్ణ మాదిగ

  • వైసీపీ కోసం కత్తి మహేశ్ పని చేశారు
  • మహేశ్ మృత దేహానికి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా నివాళి అర్పించలేదు
  • దళితులకు వైసీపీ గౌరవం ఇవ్వదనే విషయం మరోసారి అర్థమయింది
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈరోజు సీఎం జగన్ పై మంద కృష్ణ విమర్శలు గుప్పించారు.
 
కత్తి మహేశ్ వైసీపీ కోసం పని చేశారని మంద కృష్ణ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ కోసం, జగన్ కోసం ప్రచారం చేశారని చెప్పారు. వైసీపీ కోసం పని చేసిన వ్యక్తి చనిపోతే జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మండిపడ్డారు. మహేశ్ మృతదేహానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా నివాళి అర్పించలేదని దుయ్యబట్టారు. దళితులంటే వైసీపీకి చాలా చులకన భావం ఉందని విమర్శించారు. దళితులకు వైసీపీలో గౌరవం, గుర్తింపు ఇవ్వబోరనే విషయం మరోసారి అర్థమయిందని అన్నారు. మరోవైపు కత్తి మహేశ్ కారు ప్రమాదంపై నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు విచారణ ప్రారంభించారు.

Manda Krishna Madiga
MRPS
Kathi Mahesh
Jagan
YSRCP

More Telugu News