కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి : రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on Congress MLAs who joined other parties
  • పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్
  • లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి నాయకులను రాళ్లతో కొట్టాలని అన్నారు. తమ పార్టీని వదిలి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యేంత వరకు పోరాడతామని చెప్పారు.

ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఎన్నికలకు రావాలని అన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుబోయారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను ఈరోజు రేవంత్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రేణుకా చౌదరి నివాసానికి వెళ్లి, ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
TPCC

More Telugu News