రాష్ట్రపతి రేసులో శరద్ పవార్.. పీకేతో భేటీలో చర్చించింది ఇదేనా?

  • రెండు రోజుల క్రితం శరద్ పవార్‌తో పీకే భేటీ
  • రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన
  • మరాఠా రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించినట్టు మరాఠా రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఉన్న నేతల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నేత ఆయనేనని, కాబట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రశాంత్ కిశోర్ కోరినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనుక బీజేపీకే బలం ఎక్కువగా ఉంది. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు శరద్ పవార్ అంగీకరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆయన నిత్యం ప్రజల్లో ఉండడానికే ఇష్టపడతారని, అలాంటిది రాష్ట్రపతి భవన్‌కు పరిమితం కావడానికి ఆయన అంగీకరించకపోవచ్చని కూడా చెబుతున్నారు. రాష్ట్రపతి పోటీ విషయంలో బయట పలు వార్తలు షికార్లు చేస్తున్నా ఎన్సీపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Sharad Pawar
Prashant Kishor
President Of India
Election

More Telugu News