ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదు: ఆయుష్ కమిషనర్ రాములు

  • ఆనందయ్య మందుకు ప్రభుత్వం, హైకోర్టు అనుమతులు
  • స్పందించిన రాములు నాయక్
  • గురువారం కోర్టు నిర్ణయం వస్తుందని వెల్లడి
  • ఆపై ప్రభుత్వ చర్యలు ఉంటాయని వివరణ
ఆనందయ్య కరోనా ఔషధానికి ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయుష్ శాఖ కమిషనర్ రాములు నాయక్ స్పందించారు. ఆనందయ్య మందు వాడడం వల్ల కరోనా తగ్గిందనడానికి నిర్దిష్ట ఆధారాలు లేవని పేర్కొన్నారు. అదే సమయంలో ఔషధం వల్ల దుష్ఫలితాలు కానీ, నష్టం జరిగిందన్న ఆధారాలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదని రాములు నాయక్ పేర్కొన్నారు. ప్రభుత్వం దాన్ని ఆయుర్వేద ఔషధంగా గుర్తించడంలేదని అన్నారు.

అయితే, ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని వెల్లడించారు. తద్వారా ఎక్కువమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామని వివరించారు. గురువారం నాడు కోర్టు తుది నిర్ణయం వెలువరించనుందని, ఆ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఔషధం పంపిణీపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇక, కంటి చుక్కల మందు వల్ల హాని జరగదన్న విషయం నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. దీనిపై పూర్తి ఆధారాలకు మూడు వారాల సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Anandaiah
Corona Medicine
Ramulu Naik
Andhra Pradesh

More Telugu News