సొంతూళ్లకు తరలుతున్న వలస కార్మికులు.. అదనపు రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయం

  • డిమాండ్‌కు సరిపడా రైళ్లు లేకపోవడంతో కష్టాలు
  • 330 రైళ్లను నడపాలని నిర్ణయం
  • 674 అదనపు ట్రిప్‌లు నడుస్తాయన్న రైల్వే బోర్డు చైర్మన్
  • అదనపు రైళ్లలో అత్యధికశాతం ఉత్తరాదికే
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండోసారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వలస కార్మికులు తిరిగి సొంతూళ్లకు తరలిపోతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సరిపడా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల్లో 330 అదనపు రైళ్లను నడపనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. ఈ రైళ్లు మొత్తం 674 అదనపు ట్రిప్‌లు తిరుగుతాయన్నారు.

అదనపు రైళ్లలో అధికశాతం గోరఖ్‌పూర్, పాట్నా, దర్బంగా, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్, వారణాసి, గువాహటి, బరౌనీ, ప్రయాగ్‌రాజ్, రాంచీ, లక్నో, కోల్‌కతా నగరాలకు తిరగనున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ రైళ్లు మాత్రం తిరుగుతాయని, అయితే, రద్దీలేని చోట్ల మాత్రం సర్వీసులు తగ్గించి, డిమాండ్ అధికంగా ఉన్నచోట అదనపు రైళ్లను తిప్పుతామని సునీత్ శర్మ తెలిపారు. కాగా, ప్రస్తుతం రోజుకు సగటున 1514 స్పెషల్ రైళ్లతోపాటు 5387 సబర్బన్ సర్వీసులు నడుస్తున్నాయి.

Indian Railways
Special Trains
COVID19
Migrant Workers

More Telugu News