నామినేష‌న్లు దాఖ‌లు చేసిన జానారెడ్డి, నోముల భ‌గ‌త్

nomula janareddy file nominations
  • 'సాగ‌ర్' ఉప ఎన్నిక నామినేష‌న్ల‌కు ఈ రోజే చివ‌రి రోజు 
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 20 మందికిపైగా నామినేష‌న్లు
  • వ‌చ్చేనెల‌‌ 17న  ఎన్నిక‌
నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ల‌కు ఈ రోజే చివ‌రి రోజు కావ‌డంతో ప‌లు పార్టీల అభ్య‌ర్థుల‌తో పాటు స్వ‌తంత్రులు నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు త‌ర‌లివ‌చ్చారు. నిడ‌మ‌నూరు ఆర్వో కార్యాల‌యంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుమార్ త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వెంట తెలంగాణ మంత్రులు మ‌హ‌ముద్ అలీ, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేత‌లు ఉన్నారు.

అలాగే, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి కూడా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. బీజేపీ అభ్య‌ర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ కాసేప‌ట్లో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌ వరకు గడువు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 20 మందికిపైగా నామినేష‌న్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జ‌ర‌ప‌నున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 3 వరకు గడువు ఉంది. ఈ ఎన్నిక‌ వ‌చ్చేనెల‌‌ 17న జ‌రగనున్న విష‌యం తెలిసిందే. 2న ఫలితం వెల్లడ‌వుతుంది.
Go Back to Shorts
Jana Reddy
nomula
TRS
BJP

More Telugu News