మంగళగిరి మండలంలో ఉద్రిక్తతలకు దారితీసిన ఆక్రమణల తొలగింపు

  • ఆత్మకూరు గ్రామంలో నిర్మాణాల కూల్చివేత
  • అడ్డుకున్న స్థానికులు
  • పోలీసుల సాయంతో కూల్చివేసిన అధికారులు
  • కన్నీటి పర్యంతమైన ప్రజలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు పేరిట చర్యలు చేపట్టారు. అయితే కొన్ని నివాసాల తొలగింపు నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పొక్లెయిన్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సాయంతో అధికారులు పలు నిర్మాణాలను కూల్చివేశారు. దాంతో ఆత్మకూరు ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ నిర్మాణాలకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని, అయినప్పటికీ అధికారులు కూల్చివేయడం దారుణమని వాపోయారు. తాము గత 4 దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని, తమకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా, నిర్మాణాలు ఎలా తొలగిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడని ఆరోపించింది. పేదల పట్ల సీఎం జగన్ కు ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించింది. ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించింది.

Athmakur
Encroachments
Villagers
Police
TDP
Andhra Pradesh

More Telugu News