మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు

narayana gets notice from cid
  • అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల విషయంలో నోటీసులు
  • ఈ నెల 23న విచారణకు రావాలన్న‌ అధికారులు
  • ఇప్పటిర‌కు స్పందించ‌ని చంద్రబాబు, నారాయ‌ణ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఈ రోజు ఉద‌యం వెళ్లిన సీఐడీ అధికారులు అమ‌రావ‌తి రాజధానిలో అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు.

అంతేగాక‌, ఆయ‌న‌తో పాటు ఏపీ మాజీ మంత్రి పి.నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నారాయణ హైదరాబాద్‌లో లేరు. ఆయ‌న‌ ఈ నెల 23న విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల‌పై ఇప్పటిర‌కు చంద్రబాబు, నారాయ‌ణ స్పందించ‌లేదు.

ఏపీలో గ‌త ప్ర‌భుత్వంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్ర‌బాబు, నారాయ‌ణ‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌ భూముల క్ర‌య‌, విక్ర‌యాల‌కు సంబంధించి గత నెల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు.

దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఈ రోజు చంద్రబాబు,  నారాయణకు నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
Go Back to Shorts
narayana
Chandrababu
Telugudesam

More Telugu News