విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నా: కేటీఆర్

  • అవసరమైతే విశాఖకు వెళ్లి మద్దతు ప్రకటిస్తా
  • రేపు తెలంగాణ జోలికి కూడా కేంద్రం వస్తుంది
  • ఇక్కడి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేస్తామంటారు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకూడదంటూ జరుగుతున్న పోరాటానికి తాను కూడా మద్దతు తెలుపుతున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అవసరమైతే విశాఖకు వెళ్లి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలతో వైజాగ్ స్టీల్ ప్లాంటును సాధించుకున్నారని... అలాంటి ప్లాంటును వంద శాతం అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్ర నిర్ణయంతో వేలాది మంది ప్లాంట్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

విశాఖ ప్లాంటు కోసం జరుగుతున్న పోరాటానికి మనం మద్దతు ప్రకటించకపోతే... రేపు మన దగ్గరకు కూడా వస్తారని... తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి  ఇలా అన్నింటినీ అమ్మేస్తారని కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను ప్రైవేటు పరం చేస్తామని అంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా ప్రధాని మోదీ తీరు ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ ఉద్యమానికి తాము మద్దతిస్తామని... తెలంగాణ సంస్థలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తే వారు కూడా తమతో కలిసి పోరాటానికి రావాలని కేటీఆర్ అన్నారు. 

KTR
TRS
Vizag Steel Plant
Protest
Support

More Telugu News