నేనే సీఎం అయ్యుంటే టీడీపీలో చంద్రబాబు మాత్రమే మిగిలేవారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • జగన్ సీఎం కాబట్టి, టీడీపీలో కొంతమందైనా వున్నారు 
  • రాజీనామాలు చేసినంత మాత్రాన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు
  • మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుంది
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టీడీపీలో కనీసం కొంతమంది ఎమ్మెల్యేలైనా ఉన్నారని... తాను సీఎం అయ్యుంటే టీడీపీలో కేవలం చంద్రబాబు మాత్రమే మిగిలేవారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన చెప్పారు. రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన బాధతో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం 90 శాతం వైసీపీ విజయం సాధిస్తుందని అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీకి తీసుకెళ్తామని జగన్ చెప్పారని... ఏ సమస్యపైన అయినా, ఒక్కసారైనా చంద్రబాబు అఖిలపక్షం పెట్టారా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కు అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని ఇనుప గనులను కేటాయిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆ గనులను కేటాయించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. గ్రామ సచివాలయాల్లోని ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.

Peddireddi Ramachandra Reddy
YSRCP
Jagan
Chandrababu
Telugudesam

More Telugu News