రేపటి రాష్ట్ర బంద్ కు మద్దతిస్తున్నాం: మంత్రి పేర్ని నాని ప్రకటన

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బంద్
  • రేపు ఏపీలో బంద్ నిర్వహించాలని కార్మిక సంఘాల పిలుపు
  • ఇప్పటికే టీడీపీ సహా పలు పార్టీల మద్దతు
  • సచివాలయంలో మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం
  • కార్మిక సంఘాలకు సంఘీభావం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విపక్ష టీడీపీ సహా పలు పార్టీలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. తాజాగా అధికారపక్షం వైసీపీ కూడా బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బంద్ చేపడుతున్న కార్మిక సంఘాలకు వైసీపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటిస్తోందని స్పష్టం చేశారు.

బంద్ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని, ఆ తర్వాత బస్సులు మామూలుగానే తిరుగుతాయని చెప్పారు. రేపటి బంద్ కు సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా నల్ల బ్యాడ్జీలు ధరించాలని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర పునఃసమీక్షించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని, కేంద్రం ఈ అంశంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పేర్కొన్నారు. నేడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు.  

State Bandh
Andhra Pradesh
Vizag Steel Plant
Privatisation
YSRCP
Perni Nani

More Telugu News