ఎంజీఆర్​ స్థానం నుంచి కమల్​ బరిలోకి!

  • అళందూరు నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం 
  • అక్కడ పట్టుండడమూ కారణమేనంటున్న పార్టీ నేతలు
  • అక్కడి నుంచే రెండో దశ ఎన్నికల ప్రచారం ప్రారంభం
ఎంజీఆర్ కు అసలైన రాజకీయ వారసుడిని తానేనంటూ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామని చెబుతున్న అన్నా డీఎంకే.. ఎంజీఆర్ కలలను మాత్రం నెరవేర్చలేదంటూ విమర్శల బాణాలు వదులుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎంజీఆర్ పోటీ చేసి గెలిచిన స్థానం నుంచే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలహాసన్ బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. 1967 నుంచి 76 వరకు ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించిన అళందూరు నుంచి కమల్ పోటీ చేసేందుకు నిశ్చయించుకున్నారని ఎంఎన్ఎం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం అక్కడి నుంచే రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని వెల్లడించాయి.

ఎంజీఆర్ నియోజకవర్గం కావడంతో పాటు 2019లో నిర్వహించిన లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పార్టీకి 10 శాతం ఓట్లు రావడం వంటి కారణాలతో అళందూరునే కమల్ ఎంచుకున్నట్టు సమాచారం. కాగా, బుధవారం రాత్రి 8 గంటలకు మైలాపూర్ లో కమల్ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 7న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ ప్రకటించనుంది.

MGR
Kamal Haasan
MNM
Tamil Nadu
Tamilnadu

More Telugu News