పంచాయతీ ఎన్నికల్లో ఇలా గెలిచి.. అలా పార్టీ మార్చిన స్థానిక నేతలు!

  • గంటల్లోనే పార్టీలు మార్చేసిన గెలిచిన సర్పంచ్‌లు
  • మంత్రి గౌతమ్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు
  • విస్తుపోతున్న టీడీపీ శ్రేణులు
పంచాయతీ ఎన్నికల్లో ఇలా గెలిచారో, లేదో.. అలా పార్టీ మార్చేశారు కొందరు స్థానిక నేతలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిందీ ఘటన. రెండో విడతలో భాగంగా శనివారం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. సంగం మండలం చెర్లోవంగుల్లలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు.

అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. అలాగే, ఏఎస్‌పేట మండలం పెద్దబ్బీపురానికి చెందిన ఎ.మాధవరెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆదివారం ఆయన మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే మండలంలోని చౌటభీమవరం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో విజయం సాధించిన లక్ష్మీనారాయణ కూడా వైసీపీలో చేరడం గమనార్హం. దీంతో వారి గెలుపునకు కృషి చేసిన టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి.

TDP
Gram Panchayat Elections
Nellore District
YSRCP

More Telugu News