మీ భార్య దత్తత గ్రామం, మీ అత్తగారి జిల్లాలో కూడా వైసీపీ ప్రభంజనమే బాబూ!: విజయసాయిరెడ్డి

  • టీడీపీ బతికే ఉందని చంద్రబాబు భ్రమ రాజకీయాలు చేస్తున్నారు
  • పచ్చ కుల మీడియాలో అసత్య వార్తలు వేయిస్తున్నారు
  • ఫేక్ న్యూస్ వేయించినంత మాత్రాన టీడీపీ గెలిచినట్టేనా?
ఏపీలో పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికలు  గతంలో ఎన్నడూ లేనంతగా వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఓవైపు ఎస్ఈసీకి, పార్టీలకు మధ్య వివాదాలు. మరోవైపు పార్టీల మధ్య కుమ్ములాటలు. ఏకగ్రీవాలపై విమర్శలు, ప్రతివిమర్శలు. ఇలా చెప్పుకుంటూ పోతే... ఈసారి ఎన్నికలు అన్ని విషయాల్లో వివాదాస్పదమే అని చెప్పుకోవచ్చు. చివరకు ఫలితాలు సైతం చర్చనీయాంశంగా మారుతున్నాయి.

మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ ఎద్దేవా చేస్తే... ఆ ఊరికి, తనకు సంబంధమే లేదని కొడాలి నాని చెప్పారు. తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామని ఆయన తెలిపారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఊర్లో కూడా టీడీపీ గెలుపొందిందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు.

తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు చేస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. పచ్చ కుల మీడియాలో అసత్య వార్తలు వేయించినంత మాత్రాన పంచాయతీలను టీడీపీ గెలుచుకున్నట్టేనా? అని ప్రశ్నించారు. మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారని అన్నారు. మీ అత్తగారి జిల్లాలో కూడా వైసీపీ ప్రభంజనమే బాబూ అని ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Gram Panchayat Elections

More Telugu News