ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నాపై దాడిచేశారు: టీడీపీ నేత పంతగాని ఫిర్యాదు

  • వలంటీర్లతో సమావేశం ఏంటని ప్రశ్నించినందుకు దాడిచేశారన్న పంతగాని
  • అవాస్తవమన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు
  • పంతగానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ కార్యకర్త, వార్డు సభ్యుడు
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై టీడీపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర సంస్కృతిక విభాగాం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని ఓ కల్యాణ మండపంలో వలంటీర్లతో వైసీపీ నేతలు సమావేశమయ్యారని, పంచాయతీ ఎన్నికల వేళ ఇది సరికాదని చెప్పిన తనపై ఎమ్మెల్యే శ్రీనివాసులు దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పంతగాని ఆరోపించారు.

పంతగాని ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు. పంతగానిని తాను కలవనేలేదని, అలాంటప్పుడు దాడెలా చేస్తానని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రైల్వే కోడూరులో అలజడి సృష్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, టీడీపీ నేత పంతగానే తమపై దాడిచేశారని రైల్వే కోడూరు పంచాయతీ వార్డు సభ్యుడు ఎస్ వినోద్ కుమార్, వైసీపీ కార్యకర్త డి.సాయిగణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించామని, అసలేం జరిగిందో తెలుసుకున్న అనంతరం కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Railway Kodur
Kadapa District
panthagani narasimha prasad

More Telugu News