ఏపీ ఎస్ఈసీ విడుద‌ల చేసిన ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో ఏపీ స‌ర్కారు పిటిష‌న్!

ap govt files petition in high court
  • ఫిర్యాదుల స్వీకరణకు యాప్ ప్రారంభం
  • భద్రతాపరమైన అనుమతులు తీసుకోలేద‌న్న స‌ర్కారు
  • యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటిష‌న్
  • కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరేలా ఉంద‌ని అభ్యంత‌రం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొనసాగుతోన్న నేప‌థ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్  ‘ఈ-వాచ్‌’ పేరిట యాప్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ‌విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు యాప్‌ను ఆవిష్కరించారు.

రేప‌టి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్న నేప‌థ్యంలో దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. భద్రతాపరమైన అనుమతులు లేకుండానే ఈ-వాచ్‌ యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్ర‌భుత్వం పిటిష‌న్‌లో తెలిపింది.

యాప్ లో భ‌ద్రతాపర‌ సమస్యలు, హ్యాక్‌ అయ్యే ప్ర‌మాదం ఉందని చెప్పింది. ఇప్ప‌టికే పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉండగా కొత్త‌గా ఈ-వాచ్‌ యాప్‌ ఎందుకని ప్రశ్నించింది. ఈ చ‌ర్య ఏపీలో కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరేలా ఉంద‌ని తెలిపింది. దీంతో ప్ర‌భుత్వ పిటిష‌న్ పై రేపు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
Go Back to Shorts
AP High Court
Andhra Pradesh

More Telugu News