భారత్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్న 10 లక్షల కరోనా టీకాలు

  • ఆఫ్రికా ఖండంలో అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే
  • ఈ నెలలోనే మరో 5 లక్షల డోసులు
  • భారత్ నుంచి టీకాలు అందాయన్న అధ్యక్షుడు రామఫోసా
ప్రపంచ దేశాలకు కరోనా టీకాలు అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్న భారతదేశం తాజాగా దక్షిణాఫ్రికాకు వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసింది. ఫలితంగా సెకెండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న ఆ దేశానికి పెద్ద ఊరట లభించింది. 10 లక్షల డోసుల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లతో కూడిన విమానం నిన్న ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగా, అధ్యక్షుడు సెరిల్ రామఫోసా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ.. భారత్ నుంచి తమ దేశానికి తొలి దశ కరోనా టీకాలు అందినట్టు చెప్పారు. ఈ నెలలోనే మరో 5 లక్షల డోసులు దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నాయి. ఆఫ్రికా ఖండంలో అత్యధిక కేసులు, మరణాలు దక్షిణాఫ్రికాలోనే నమోదయ్యాయి. ఇక్కడ 1.4 మిలియన్ల కేసులు నమోదు కాగా, 44 వేల మరణాలు సంభవించాయి. అంతేకాదు, గతేడాది ఇక్కడ ‘501Y.V2’ అనే మరో ప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్ కూడా బయటపడింది. ఆ తర్వాత యూరప్, అమెరికా, ఆసియాలోనూ ఈ రకం వైరస్‌ను గుర్తించారు.

South Africa
COVID19
Covid Vaccine
Austrazeneca
Serum Institute of India

More Telugu News