దళితులంతా ఏకమై జగన్ పై తిరగబడాలి: అచ్చెన్నాయుడు

  • ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే జగన్ పరామర్శించలేదు
  • ఒక మంత్రి తల్లి చనిపోతే హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శించారు
  • దళితులపై ఎందుకు అంత చులకన భావం?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించలేదని విమర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించని జగన్ పై దళితులంతా ఏకమై తిరగబడాలని అన్నారు. జగన్ ను దళితులు రాష్ట్రం నుంచి వెలివేయాలని వ్యాఖ్యానించారు. దళితులపై జగన్ కు నిజంగా అభిమానం ఉంటే... దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేవారని అన్నారు.

ఎంపీ చనిపోతే పరామర్శించే బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. దుర్గాప్రసాద్ చనిపోయిన 12 రోజులకు బందర్ లో ఓ మంత్రి తల్లి చనిపోయారని... ఆ సందర్భంగా హెలికాప్టర్ లో వెళ్లి జగన్ ఆయనను పరామర్శించారని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్సీ చనిపోతే హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శించారని గుర్తుచేశారు. దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. దళితులపై జగన్ కు అంత చులకన భావం ఎందుకని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Atchannaidu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News