దుర్గ క్షేమం... కువైట్ నుంచి గన్నవరం వచ్చిన మహిళ కడపలో ప్రత్యక్షం!

  • ఇటీవల కువైట్ నుంచి గన్నవరం వచ్చిన దుర్గ
  • ఎయిర్ పోర్టు నుంచి మిస్సింగ్
  • ఇంటికి చేరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
  • కడపలో తన చెల్లి వద్ద దుర్గ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
  • భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్
కొన్నిరోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాలసత్తి దుర్గ అనే మహిళ కువైట్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. భార్య ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో భర్త సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజి పరిశీలిస్తే టెర్మినల్ నుంచి వెలుపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి తప్ప, ఆమె ఏ వాహనం ఎక్కిందన్న దానిపై స్పష్టత లేదు. దాంతో కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో దుర్గ కడపలోని తన చెల్లెలు వద్ద ఉన్నట్టు వెల్లడైంది. కువైట్ నుంచి భారత్ వచ్చే ముందు ఫోన్ లో దుర్గ, సత్యనారాయణ గొడవపడ్డారు. దాంతో భర్తకు భయపడిన దుర్గ ఇంటికి వెళ్లకుండా కడపలోని తన చెల్లెలు వద్దకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆమె భర్త సత్యనారాయణను కూడా పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దుర్గ, సత్యనారాయణ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Durga
Kadapa
Gannavaram
Kuwait
Police
West Godavari District

More Telugu News