ఆయనను మనిషనాలా? లేక ఇంకేమైనా అనాలా?: కొడాలి నానిపై అచ్చెన్నాయుడు ఫైర్

Atchannaidu fires on Kodali Nani
  • రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తినే విమర్శిస్తున్నారు
  • ఇలాంటి వారిని దేవుడు కూడా క్షమించడు
  • ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
తమ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఓనమాలు కూడా రాని వారు కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ముఖ్యంగా మంత్రి కొడాలి నానిపై అచ్చెన్న విరుచుకుపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిపైనే విమర్శలు చేస్తున్నారని, కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిని మనిషనాలా? లేక ఇంకేమైనా అనాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను దేవుడు కూడా క్షమించడని దుయ్యబట్టారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్ర మంత్రులు కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. జగన్ కు మంత్రులంతా తాబేదారులుగా పని చేస్తున్నారని అన్నారు. తాము కూడా వాళ్ల కంటే ఎక్కువగా మాట్లాడగలమని... అయితే తమకు సంస్కారం అడ్డొస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని... ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసుకుంటున్నామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Go Back to Shorts
Atchannaidu
Chandrababu
Telugudesam
YSRCP
Kodali Nani

More Telugu News