ఇలా చేస్తే కరోనాపై యుద్ధంలో గెలిచినట్టే: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

  • రాబోయే 50 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • సంక్రాంతి సమయంలో ప్రజలు షాపింగులకు వస్తారు
  • కరోనా వ్యాప్తి కాకుండా అందరు బాధ్యతగా వ్యవహరించాలి
కొన్ని రోజుల క్రితం వరకు ఏపీలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే  కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించిందని అన్నారు. యుద్ధంలో భాగంగా 50 రోజుల పాటు ప్రజలను మరింత అప్రమత్తం చేస్తామని చెప్పారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని గ్రామాల్లో సందడి నెలకొంటుందని... షాపింగ్ చేయడానికి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణాలు, నగరాలకు వస్తారని తమ్మినేని అన్నారు. దీంతో, కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని చెప్పారు. మూడు సూత్రాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని అన్నారు. 'మాస్క్ సరిగా పెట్టు కరోనా ఆటకట్టు, ఆరు అడుగుల భౌతిక దూరం కరోనా మీకు దూరం, చేతులు శుభ్రం ఆరోగ్యం భద్రం' అనే ఈ మూడు సూత్రాలను పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ వారియర్స్ మాదిరి పని చేస్తే కరోనాను కట్టడి చేయవచ్చని అన్నారు.

Tammineni Sitaram
YSRCP
Corona Virus

More Telugu News