పోలవరం మహానందీశ్వరస్వామి ఆలయంలో సినీ నటి అనుష్క పూజలు.. ఆలయం ఆహ్లాదకరంగా ఉందన్న కథానాయిక!

  • స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనుష్క
  • ఆమె వెంట కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కథానాయిక అనుష్క నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో సందడి చేశారు. సన్నిహితులతో కలిసి గోదావరి మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయితే, ఆ సమయంలో ఆమె మాస్కు ధరించి ఉండడంతో ఎక్కువమంది ఆమెను గుర్తించలేకపోయారు.

ఆమె పడవలో నది దాటుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వెంట కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కూడా ఉన్నారు. స్వస్థలం మంగళూరు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం చేరుకున్న ఆమె, అక్కడి నుంచి బోటులో ఆలయానికి చేరుకున్నారు. పూజల అనంతరం అనుష్క మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలని అనుకుంటున్నానని, అయితే షూటింగులలో బీజీగా ఉండడం వల్ల కుదరలేదని అన్నారు. ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని చెప్పారు.

ఎటువంటి హంగుఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిలా వచ్చిన ఆమెను గుర్తుపట్టిన అభిమానులు ఫిదా అయ్యారు. కాగా, గతేడాది చిరంజీవి సినిమా ‘సైరా’లో ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో అనుష్క కనిపించారు. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. 

Anushka Shetty
Tollywood
Polavaram
Andhra Pradesh

More Telugu News