బీజేపీ కార్యకర్తలు నన్ను చంపేందుకు ప్రయత్నించారు: పువ్వాడ అజయ్

  • విషయం తెలుసుకోకుండా నారాయణ మాట్లాడారు
  • ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ లో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు
  • ఇలాంటి దాడులకు నేను భయపడను
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న కేపీహెచ్బీ కాలనీలో మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లకు డబ్బు పంచేందుకు అజయ్ వచ్చాడని ఆరోపిస్తూ వారు దాడికి యత్నించారు.

ఈ ఘటనపై సీపీఐ నారాయణ కూడా స్పందిస్తూ, వాహనం బ్యానెట్ పై ఒక బీజేపీ కార్యకర్త ఉన్నప్పటికి ఆపకుండా వెళ్లిపోయారని... అతను కిందపడి, చనిపోయి ఉంటే పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో పువ్వాడ అజయ్ స్పందించారు.

బీజేపీ కార్యకర్తలు తనను చంపేందుకు యత్నించారని మంత్రి అజయ్ అన్నారు. తన కారుపైకి ఎక్కి నానా హంగామా చేశారని చెప్పారు. తనపై చేసిన దాడిని చికెన్ నారాయణ సమర్థిస్తున్నారా? అని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా నారాయణ అలా మాట్లాడటం సరికాదని చెప్పారు. తాను కూడా కమ్యూనిస్టు బిడ్డనే అని... ఇలాంటి దాడులకు తాను భయపడనని చెప్పారు.

బాచుపల్లిలోని తమ మెడికల్ కాలేజీకి వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని అజయ్ తెలిపారు. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ లోనే దాడికి తెగబడ్డారని అన్నారు. కమలం పువ్వు నేతలు చెపుతున్నట్టు కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను వెర్రి పువ్వును కాదని ఎద్దేవా చేశారు.

Puvvada Ajay Kumar
CPI Narayana
TRS
BJP

More Telugu News