చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రానున్న బండి సంజయ్.. కేసీఆర్‌కు సవాల్‌తో ఉత్కంఠ

bandi sanjay to reach charminar
  • 11 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ
  • బీజేపీ వల్లే వరద సాయం నిలిచిందంటూ ఆరోపణలు
  • బీజేపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం
  • నిజాలు తేల్చుకుందామంటూ కేసీఆర్‌కు బండి సంజయ్ స‌వాల్  
వరద సహాయం విషయంలో సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్‌తో చార్మినార్‌ వద్ద టెన్షన్‌‌ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీగా సంజయ్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్దకు రానున్నారు. బీజేపీ వల్లే వరద సాయం నిలిచిందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపట్ల బీజేపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

వరద సాయం ఆపాలని‌ తాను లేఖ రాయలేదని బండి‌ సంజయ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే సీసీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. లేఖ‌పై నిజాలు తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ స‌వాల్ విసిరారు. మధ్యాహ్నం 12 గంటలకు భాగ్య‌ల‌క్షి ఆల‌యం వ‌ద్ద‌కు రావాలంటూ ముఖ్య‌మంత్రికి స‌వాల్ విసిరారు.

ర్యాలీగా భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు సంజ‌య్ చేరుకోనున్నారు. కాగా బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా...ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ నేత‌లు పట్టుబడుతున్నారు. ఎట్టిప‌రిస్థితుల్లో 12 గంటలకు భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్దకు వస్తామని బండి సంజయ్ ప్రకటించారు. కాగా ఈరోజు శుక్ర‌వారం కావ‌డంతో పోలీసుల్లో టెన్ష‌న్ నెలకొంది.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
KCR

More Telugu News