స్వరూపానంద జన్మదిన వేడుకలపై అసత్య ప్రచారం జరుగుతోంది: విశాఖ శ్రీ శారదాపీఠం

  • హైందవ ధర్మ పరిరక్షణే శారదాపీఠం ముఖ్య ప్రాధాన్యత
  • ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలనే ఆలయ మర్యాదలు కోరాం
  • ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం
రేపు విశాఖ శారదాపీఠం స్వారూపానంద పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 23 ప్రముఖ ఆలయాలు ఆయనకు ఆలయ మర్యాదలు, కానుకలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏ పీఠాధిపతికీ లేని మర్యాదలు స్వరూపానందకు మాత్రం ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నించించారు. ఈ నేపథ్యంలో విశాఖ శారదాపీఠం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

'సనాతన హైందవ ధర్మ పరిరక్షణే విశాఖ శ్రీ శారదాపీఠం ముఖ్య ప్రాధాన్యత. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చేయడానికి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చేస్తున్న కృషి విదితమే. గత మూడు రోజులుగా మహాస్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలపై అసత్య ప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోంది. మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరాం. 2004 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆలయాల నుంచి మహాస్వామి వారికి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేయడం ఆనవాయతీగా వస్తోంది. ఆ సాంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని విశాఖ శ్రీ శారదాపీఠం కోరడమైనది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తాం' అంటూ విశాఖ శారదాపీఠం ప్రకటన రూపంలో తెలపింది. శారదాపీఠం మేనేజర్ పేరుతో ఈ ప్రకటన వెలువడింది.

Swaroopananda Swamy
Visakha Sharada Peetham
Temple Respects

More Telugu News