పెద్దాయనా... మీకు వందనం: ఓ వృద్ధుడి తపనకు ఎంపీ సంతోష్ ఫిదా

  • గురుగ్రామ్ లో ఓ వృద్ధుడి పర్యావరణ స్పృహ
  • వేకువజామునే లేచి రోడ్ డివైడర్ పై ఉన్న మొక్కలకు నీళ్లు
  • మాటలు చాలడంలేదు సర్ అంటూ సంతోష్ కుమార్ స్పందన
గురుగ్రామ్ లో 91 ఏళ్ల వృద్ధుడు ప్రతి రోజూ వేకువజామున 4 గంటలకే లేచి రహదారి డివైడర్ పై ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుండడం నెట్టింట వైరల్ గా మారింది. ఆ గురుగ్రామ్ వృద్ధుడికి ఇది నిత్యకృత్యం. ఈ విషయాన్ని నితిన్ సంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విశేష స్పందన వచ్చింది. ఈ వీడియోను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా చూశారు.

ఇప్పటికే గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట ఉద్ధృతంగా పర్యావరణ ఉద్యమం నడిపిస్తున్న సంతోష్ కుమార్ ను... ఆ 91 ఏళ్ల వృద్ధుడి తపన మరింత ఆకట్టుకుంది. ఈ పెద్దాయనను పొగడడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. 'మీకు నా వందనాలు సమర్పించుకుంటున్నాను సర్. ప్రకృతికి మేలు చేయాలన్న సంకల్పం మీకు ఉంటే మాత్రం మిమ్మల్ని ఏదీ ఆపలేదు. మీకు మరింత శక్తి కలగాలని ప్రార్థిస్తున్నాను సర్. ఇలాంటి గొప్ప సంకల్పాన్ని వెలుగులోకి తెచ్చిన నితిన్ సంగ్వాన్ గారికి కృతజ్ఞతలు' అంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ లో స్పందించారు.

Santosh Kumar
Old Man
Plants
Watering
Gurgaon
Green India Challenge

More Telugu News