ఎస్పీ బాలు మరణంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాప సందేశాలు

  • ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన బాలసుబ్రహ్మణ్యం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన రామ్ నాథ్ కోవింద్, మోదీ
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం
సినీ గాయక ప్రపంచంలో రారాజుగా పేరుప్రఖ్యాతులు అందుకున్న బహుభాషా గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని రామ్ నాథ్ కోవింద్ తెలిపారు.

'పాడుమ్ నిలా', 'పాటల చందమామ' అంటూ అశేష అభిమాన జనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రకటన చేశారు.

బాలు మరణం మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు: ప్రధాని

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం అన్న ప్రధాని, మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలు పేరు ప్రతి ఇంటా వినిపించేదని, దశాబ్దాలుగా ఆయన మధుర కంఠస్వరం, సంగీతం శ్రోతలను అలరించిందని తెలిపారు. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.



Ram Nath Kovind
Narendra Modi
SP Balasubrahmanyam
Demise
Corona Virus

More Telugu News