రెండు క్యాచ్ లు వదిలి మరీ రాహుల్ తో సెంచరీ చేయించిన కోహ్లీ!

  • బెంగళూరుతో మ్యాచ్ లో పంజాబ్ భారీ స్కోరు
  • రాహుల్ 132 నాటౌట్
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 206 పరుగులు చేసిన పంజాబ్
క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఊరికే అనలేదు. ఫీల్డర్ ఒక్క క్యాచ్ జారవిడిచినా దాని మూల్యం భారీ స్థాయిలో ఉండొచ్చు. అయితే విరాట్ కోహ్లీ వంటి మెరుపు ఫీల్డర్ ఓ క్యాచ్ వదలడం ఎవరూ ఊహించలేనిది. అది కూడా రెండు సార్లు బంతి కోహ్లీ చేజారితే ఇంకేమనాలి? కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో అదే జరిగింది.

కోహ్లీ ఇచ్చిన డబుల్ లైఫ్ తో బతికిపోయిన కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు సిక్సర్ల మోత మోగించి జట్టు స్కోరును 200 దాటించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 206 పరుగులు నమోదు చేసింది. కేఎల్ రాహుల్ ఆటే ఈ ఇన్నింగ్స్ కు హైలైట్ అని చెప్పాలి.

రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 132 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. రాహుల్ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని కూడా సిక్సర్ గా మలిచి తన పరుగుల దాహాన్ని చాటుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, నికోలాస్ పూరన్ 17 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శివం దూబే 2, చహల్ ఓ వికెట్ తీశారు.

KL Rahul
Virat Kohli
Catches
Kings XI Punjab
Royal Challengers Banglore
IPL 2020

More Telugu News