అంతర్వేది ఘటన మరువక ముందే మరో ఘటన: ఫొటోలు పోస్ట్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • విజయవాడ దుర్గమ్మ  రథానికి నాలుగు వెండి సింహాలు ఉంటాయి
  • వాటిలో మూడు చోరీకి గురయ్యాయి
  • ఆ సంగతి ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చుతున్నారు
  • వేరే కొత్త వెండి సింహాలు తయారుచేస్తున్నారు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం కావడం పట్ల తీవ్ర విమర్శలు, నిరసనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఆలయాల విషయంలో మరో ఘటన చోటు చేసుకుందంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.
 
'అంతర్వేది ఘటన మరువక ముందే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురయ్యాయి. ఆ సంగతి ఎవరికీ తెలియకుండా వేరే కొత్త వెండి సింహాలు తయారుచేసే పనిలో అధికారులు ఉండడం దురదృష్టకరం. ఇలాంటివి తెలుగుదేశం తీవ్రస్థాయిలో ఖండిస్తుంది' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

'ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆలయాలకు కూడా భద్రత కరవైందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వెయ్యాలి. లేకపోతే ప్రజాగ్రహం తప్పదు' అని గోరంట బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.

Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News