బిస్కెట్లు తిన్న మరో చిన్నారి మృతి.. కర్నూలు జిల్లాలో విషాదం

  • ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో ఘటన
  • బిస్కెట్లు టీలో ముంచుకుని తిన్నవెంటనే కుప్పకూలిన చిన్నారులు
  • ఒక రోజు వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో బిస్కెట్లు తిన్న మరో చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, దిల్‌షాద్ దంపతులకు హుసేన్ బాషా (6), హుసేన్ బీ(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం తమ బాబాయి కుమార్తె జామాల్‌బీ (8)తో కలిసి గ్రామంలోని ఓ దుకాణంలో బిస్కెట్లు కొనుక్కుని, ఇంటికొచ్చి టీలో ముంచుకుని వాటిని తిన్నారు. ఆ వెంటనే చిన్నారులు ముగ్గురు వాంతులు చేసుకుని కుప్పకూలారు.  కంగారు పడిన తల్లిదండ్రులు ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే హుసేన్‌బాషా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హుసేన్ బీ, జమాల్ బీ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హుసేన్ బీ ఈ ఉదయం కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు ఇద్దరినీ కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఫుడ్ పాయిజన్ కారణంగానే కాగానే పిల్లలు మృతి చెందినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు తహసీల్దార్ తెలిపారు.

Andhra Pradesh
Kurnool District
Allagadda
food poison
Biscuts

More Telugu News