హిందుత్వంపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు: సోము వీర్రాజు

Somu Veerraju says TDP has no right to talk on Hindutva
  • రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయని వెల్లడి
  • ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకోవడంలేదని ఆరోపణ
  • ఇలాంటి దాడులను బీజేపీ సహించబోదని స్పష్టీకరణ
  • గత టీడీపీ సర్కారుపైనా విమర్శలు
ఏపీలో హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఆరోపించారు. హిందుత్వంపై దాడులను బీజేపీ సహించదని సోము స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గత టీడీపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయని మాట్లాడే హక్కు టీడీపీకి లేదని అన్నారు.

నాడు కృష్ణా పుష్కరాల సందర్భంగా 17 దేవాలయాలను టీడీపీ ప్రభుత్వం నేలమట్టం చేసిందని, అప్పుడు హిందుత్వం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. విజయవాడ గోశాల ఘటనపై మీడియా సమావేశం నిర్వహిస్తుంటే తమపై బుద్ధా వెంకన్న దాడికి యత్నించాడని ఆరోపించారు. కృష్ణా పుష్కరాల్లో ఆలయాలు కూల్చేసినప్పుడు చినరాజప్ప ఏమైపోయారు? అప్పుడు మాట్లాడని చినరాజప్ప అంతర్వేది ఘటనపై ఏ విధంగా మాట్లాడతారు? అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Somu Veerraju
Telugudesam
Hindutva
Antarvedi

More Telugu News