చెస్ ఒలింపియాడ్ లో రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచిన భారత్... విజేతలకు సీఎం జగన్ అభినందనలు

  • ఫైనల్లో సాంకేతిక సమస్యలు
  • ఇంటర్నెట్ కనెక్షన్ లో అంతరాయాలు
  • మ్యాచ్ ను గడువులోగా పూర్తిచేయలేకపోయిన భారత ఆటగాళ్లు
  • భారత్, రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించిన ఫిడే
కరోనా నేపథ్యంలో పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఎవరూ ఊహించని ఫలితం వచ్చింది. నువ్వానేనా అంటూ భారత్, రష్యా జట్ల మధ్య జరిగిన అంతిమసమరంలో రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.

ఈ పోటీలు ఆన్ లైన్ లో జరుగుతుండగా, ఫైనల్ మ్యాచ్ రెండో రౌండ్ లో భారత్ కు చెందిన దివ్య దేశ్ ముఖ్, నిహాల్ సరీన్ ఇంటర్నెట్ కనెక్షన్ లో అంతరాయం కారణంగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు. దాంతో తమ మ్యాచ్ లను నిర్ణీత సమయంలోగా ముగించలేకపోయారు. దీనిపై భారత శిబిరం అంతర్జాతీయ చదరంగం సమాఖ్య (ఫిడే)కు ఫిర్యాదు చేసింది. వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ఫిడే అధ్యక్షుడు ఆర్కడీ వోర్కోవిచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్, రష్యాలను సంయుక్తంగా చెస్ ఒలింపియాడ్ విజేతలుగా ప్రకటించారు.

93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ విజయంలో తెలుగుతేజం కోనేరు హంపి కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ విజేతలను అభినందించారు. ఈ విజయంలో ప్రముఖపాత్ర పోషించిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరిలను ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

India
Russia
Chess Olympiad
Joint Winners
Fide
Jagan
Andhra Pradesh

More Telugu News