నాన్నను చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది: ఎస్పీ చరణ్

  • కరోనా బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
  • ఎక్మో సాయంతో వెంటిలేటర్ పై ఉన్న ఎస్పీ బాలు
కరోనా బారినపడిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయనకు ఎక్మో సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాలా రోజుల తర్వాత సంతోషం వెలిబుచ్చారు. రెండు వారాల తర్వాత తన తండ్రిని చూశానని హర్షం వ్యక్తం చేశారు.

"నాన్న నన్ను చూసి గుర్తుపట్టారు. కొద్దిగా మాట్లాడారు. ఎలావున్నారు? అని అడిగితే బొటనవేలు పైకెత్తి చూపించారు. అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి వివరించాను. ఆ తర్వాత నేను ఎలా ఉన్నానని అడిగారు. అమ్మ ఎలా ఉందంటూ సైగల ద్వారా అడిగారు. చాలారోజుల తర్వాత నాన్నను చూడడం సంతోషం కలిగిస్తోంది. నన్ను చూసి ఆయన కూడా సంతోషించి ఉంటారని భావిస్తున్నాను. ఇకపై తరచుగా వెళ్లి నాన్నను కలుస్తాను. నాన్న కచ్చితంగా కోలుకుని తిరిగి వస్తారు" అంటూ ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో తెలిపారు. తన తండ్రి చికిత్సకు స్పందిస్తున్నారని అయితే రోజులో అధికశాతం మత్తులోనే ఉంటున్నారని వెల్లడించారు.

SP Charan
SP Balasubrahmanyam
Corona Virus
Positive
MGM Hospital
Chennai

More Telugu News