జగన్ గారూ.. వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గర్లోనే ఉంది: రఘురామకృష్ణరాజు

  • అమరావతి మహిళలను కుక్కలతో పోలుస్తూ పోస్టింగులు
  • తీవ్ర అభ్యంతరం తెలిపిన రఘురాజు
  • అమరావతికి న్యాయం జరుగుతుందని వ్యాఖ్య
అమరావతి  ప్రాంతానికి చెందిన మహిళలను కుక్కలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'ముఖ్యమంత్రిగారూ, వారంతా వేటకుక్కలై వెంటాడే పరిస్థితి వస్తుంది' అని అన్నారు. మహిళలను కించపరుస్తూ పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన తెలిపే వారిని కుక్కలతో పోలుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అపార్థం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. త్వరలోనే అమరావతిలో మనోధైర్య యాత్రను చేపడతానని చెప్పారు.

అమరావతికి సంపూర్ణ న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని రఘురాజు అన్నారు. రాజధాని రైతులు, మహిళలు అభద్రతాభావానికి గురికావద్దని చెప్పారు. అయోధ్య భూమిపూజను ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్షప్రసారం చేయకపోవడం దారుణమని అన్నారు. జగన్ కు గుడికడతానన్న గోపాలపురం ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభిమానం ఉంటే మరో విధంగా చాటుకోవాలి కానీ... గుడులు కడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని చెప్పారు.

Raghu Ramakrishna Raju
YSRCP
Amaravati
SVBC
TTD

More Telugu News