తమిళనాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పడవలు, కార్లు, ఇళ్లకు నిప్పు

  • ఒకరు మృతి.. పలువురికి గాయాలు
  • గతేడాది డిసెంబరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గొడవలే కారణం
  • ఇటీవల రాజకీయ నాయకుడి హత్య
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు. తలంగూడ గ్రామంలో జరిగిన ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ఈ ప్రాంతంలో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించినట్టు కడలూరు జిల్లా పోలీసు అధికారి ఎం.శ్రీఅభినవ్ తెలిపారు.

గతేడాది డిసెంబరులో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇటీవల స్థానిక రాజకీయ నాయకుడు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో అతడి వర్గం నాయకులు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇళ్లపై దాడి చేశారు. పదుల సంఖ్యలో పడవలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Tamil Nadu
Cuddalore
set ablaze
Crime News

More Telugu News