రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి నళిని ఆత్మహత్యాయత్నం.. జైలులో గొడవే కారణమా?

  • 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని
  • కుమార్తె పెళ్లి కోసం ఇటీవల పెరోల్‌పై ఆరు నెలలపాటు బయటకొచ్చిన వైనం
  • జీవిత ఖైదు పడిన తోటి ఖైదీతో గొడవతో ఆత్మహత్యాయత్నం
భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి నళిని శ్రీహరన్ వేలూరు మహిళా జైలులో గత రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె లాయర్ పుహళేంది తెలిపారు. గమనించిన జైలు అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బెయిలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల పెరోల్‌పై కుమార్తె హరిత వివాహం కోసం ఆరు నెలలపాటు బయటకు వచ్చారు. పెరోల్ ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు.

కాగా, తోటి ఖైదీకి, నళికి మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి తీసుకెళ్లిందని పుహళేంది తెలిపారు. ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొన్నారు. అయితే, గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు. విషయం తెలిసిన నళిని భర్త తనను పిలిచి ఆమెను పుళల్ జైలుకు తరలించేలా చూడాలని కోరారని, త్వరలోనే ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది వివరించారు.

మే 1991లో విశాఖపట్టణంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శ్రీపెరుంబదూర్ వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళం బాంబు పేల్చి హతమార్చింది. ఈ కేసులో నళిని, ఆమె భర్త మురుగన్‌తోపాటు మొత్తం ఏడుగురు దోషులు వేలూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన మహిళగా గుర్తింపు పొందిన నళిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.

Rajiv Gandhi
Nalini
Vellore Jail
Suicide attempt

More Telugu News