మహారాష్ట్రను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 258 మంది మృతి

  • మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 8 వేలకు పైగా కేసుల నమోదు
  • కర్ణాటక, కేరళలోనూ పెరుగుతున్న కేసులు
  • ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న వైరస్
మహారాష్ట్రలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 258 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అలాగే, 8,308 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కేసుల సంఖ్య 2,92,589కి పెరగ్గా, ఇప్పటి వరకు 11,452 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముంబై మురికివాడ ధారావిలో పది కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండగా, ఢిల్లీలో మాత్రం తగ్గుతోంది. కర్ణాటకలో నిన్న 3,693 కేసులు వెలుగు చూడగా, 115 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 55,115కు పెరగ్గా, మరణాల సంఖ్య 1,147కు చేరుకుంది. కేరళలో నిన్న 791 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఒకరు మృతి చెందారు. 133 మంది కోలుకున్నారు.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,462 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 26 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 1,20,107 కేసులు నమోదు కాగా, 3,571 మంది మరణించారు. 17,235 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.

New Delhi
Maharashtra
Kerala
Karnataka
Corona Virus

More Telugu News