రాత్రికి రాత్రి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముంది.. ఆందోళనకు పిలుపునిస్తాం: 'అంబేద్కర్ విగ్రహం'పై నక్కా ఆనంద్ బాబు

  • అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణంలో  ఉంది
  • దాన్ని పూర్తి చేయకుండా విజయవాడలో నిర్మించాలనుకోవడం మంచిది కాదు
  • తాడేపల్లిలో ఉండి ఆన్ లైన్లో శంకుస్థాపన చేశారు
విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ స్మృతి వనాన్ని పూర్తి చేయకుండా... విజయవాడలో నిర్మించాలనుకోవడం మంచిది కాదని విమర్శించారు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న తాడేపల్లిలో ఉండి కూడా ఆన్ లైన్లో శంకుస్థాపన చేశారని... ఇది అంబేద్కర్ ను కించపరిచినట్టేనని అన్నారు.

ఈ అంశంపై కనీసం ఎవరితో చర్చించలేదని ఆనంద్ బాబు దుయ్యబట్టారు. ఇంత హడావుడిగా రాత్రికి రాత్రి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారో అక్కడే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

Nakka Anand Babu
Telugudesam
Jagan
YSRCP
Ambedkar

More Telugu News