ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

  • రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని వెల్లడి
  • పొరుగు రాష్ట్రాలు 'పది' పరీక్షలు రద్దు చేశాయని తెలిపిన పవన్
  • ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని హితవు
కరోనా మహమ్మారి నానాటికీ ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తెలిపారు.

ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, చత్తీస్ గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంలేదని, డిగ్రీ, పీజీ పరీక్షలే రద్దయిపోయాయని, ఎంట్రన్స్ ఎగ్జామ్ లు, ఉద్యోగ నియామక పరీక్షలు కూడా జరపడంలేదని పవన్ వెల్లడించారు. హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైతే అక్కడి హైకోర్టు ఎంతమాత్రం అంగీకరించలేదని తెలిపారు.

పరీక్ష పేపర్ల సంఖ్య కుదించినా... ఏపీలో కరోనా విజృంభిస్తోందని, వేల కేసులు నమోదైన నేపథ్యంలో విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడం ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలే పూర్తిస్థాయిలో లేవని, ప్రైవేటు వాహనాలు కూడా సరిగా అందుబాటులో లేవని, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మనోభావాలను, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విజ్ఞతతో, విద్యార్థుల క్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఇదని స్పష్టం చేశారు.

Pawan Kalyan
Tenth Class Exams
Cancellation
Andhra Pradesh
YSRCP
Telangana
Tamilnadu
Odisha

More Telugu News