కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఫైర్

  • లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నిత్యావసరాల పంపిణీ
  • రైతులు, చిరువ్యాపారులను ఆదుకునే చర్యలు ఏవీ?
  • ఎనిమిది రహదారుల పథకంపై నిప్పులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, చిరు వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిమొళి నిన్న తూత్తుకుడి జిల్లాలోని లింగంపట్టి, కోవిల్‌పట్టి భారతీనగర్, ఇందిరానగర్, వానరముట్టి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, కళాకారులు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అనంతరం  ఆమె మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను సాకుగా చూపి ప్రజా వ్యతిరేక పథకాలను అమలు చేసేందుకు పళనిస్వామి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టనున్న ఎనిమిది దారుల రహదారి పథకంపై నిప్పులు చెరిగారు. సొంత ఆదాయం కోసమే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే రైతులు భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tamilnadu
DMK
kanimozhi
Palanisamy

More Telugu News