చట్టాన్ని గౌరవించని ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్న న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్

  • ఇవాళ హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బలు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పుల సంఖ్య మరింత పెరిగిందని వెల్లడి
  • ఇవాళ మరో 3 తీర్పులు జత కలిశాయని వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో ఏపీ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలోనూ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలోనూ హైకోర్టు ఇచ్చిన తీర్పులే అందుకు నిదర్శనం. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. చట్టం అంటే గౌరవంలేని ప్రభుత్వాన్ని నియంత్రణలో ఉంచుతున్నందుకు న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు వెలువరిస్తున్న తీర్పుల సంఖ్య మరింత పెరిగిందని, ఇవాళ వాటికి మరో 3 తీర్పులు జత కలిశాయని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా తాము అనుసరిస్తున్న పంథా సరైనది కాదని వైసీపీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. కుట్ర రాజకీయాలు, ప్రతీకార ధోరణులతో వ్యవహరిస్తున్నారని, ఇలాంటి నిర్ణయాలు, చర్యల ద్వారా అధికార పక్షం ఎంతో విలువైన న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తోందని, పన్ను చెల్లింపుదారుల ధనాన్ని కూడా వృథా చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా, ఏపీ ప్రజల వాస్తవిక సంక్షేమం, అభివృద్ధిని కాలరాస్తోందని విమర్శించారు.

Galla Jayadev
Andhra Pradesh
Law
Judiciary
AP High Court
YSRCP

More Telugu News