కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి ఈటల

  • కరోనా పరీక్షలు తగినన్ని చేయడం లేదన్న కేంద్రం
  • కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్న ఈటల
  • ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వ్యాఖ్య
తెలంగాణలో కరోనా టెస్టులను తక్కువగా నిర్వహిస్తున్నారంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. జాతీయ సగటు కంటే టెస్టులు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. ఈ లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఈటల చెప్పారు. తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

మరోవైపు, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే... కేంద్రం నుంచి విమర్శలు రావడం గమనార్హం.

Etela Rajender
Centre
Letter
Corona Virus
Testings

More Telugu News