విశాఖలో మహిళా హోంగార్డుకు కరోనా పాజిటివ్.. కలకలం!

  • బాధిత హోంగార్డును గీతం ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • ఆమె తండ్రి, సోదరికి క్వారంటైన్
  • విశాఖలో 66కు చేరిన కరోనా కేసుల సంఖ్య
విశాఖపట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరానికి చెందిన ముగ్గురు నిన్న వైరస్ బారినపడ్డారు. వీరిలో మహిళా హోం గార్డు కూడా ఉన్నారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఆమె నివసించే కొబ్బరితోట ప్రాంతంలో కలకలం రేగింది. అలాగే, ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందిలోనూ గుబులు మొదలైంది.

బాధితురాలిని గీతం ఆసుపత్రికి తరలించగా, ఆమె తండ్రి, సోదరిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా బారినపడిన మిగతా ఇద్దరిలో ఒకరు దండుబజార్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు గాజువాక ప్రియదర్శిని కాలనీ వాసి. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 66 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 26 మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు.

Visakhapatnam District
woman Homegaurd
Corona Virus

More Telugu News