తగ్గినట్టే తగ్గి.. తెలంగాణలో విజృంభించిన కరోనా!

New Corona Cases In Telangana
  • రెండు జిల్లాల్లో 22 కొత్త కేసులు
  • అత్యధికం కాంటాక్టు కేసులే
  • మర్కజ్ యాత్రికులను ఆలస్యంగా గుర్తించడమే కారణం
తెలంగాణలో గత బుధవారం నుంచి తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు, తిరిగి విజృంభించడం ప్రజల్లో ఆందోళన పెంచింది. 24 గంటల వ్యవధిలో రెండు జిల్లాల్లో 22 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వికారాబాద్‌ జిల్లాలో తొలి మరణం నమోదైంది. శని, ఆదివారాల్లో పాజిటివ్ వచ్చిన కరోనా కేసుల్లో అత్యధికం కాంటాక్టు కేసులే కావడం గమనార్హం.

ఇక, మరోసారి కరోనా విజృంభించడానికి కారణాలను అన్వేషించిన అధికారులు, మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో జరిగిన ఆలస్యమేనని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు తెలంగాణ నుంచి 1089 మంది వెళ్లినట్లు తెలుసుకున్న అధికారులు, యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి, వారిని ట్రేస్ చేసే పనులు ప్రారంభించగా, కొన్ని చోట్ల వారిని గుర్తించడం ఆలస్యమైంది. ఇప్పుడు కాంటాక్ట్ కేసులు పెరగడానికి అదే కారణమని అధికారులు అంటున్నారు.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, మర్కజ్ కు వెళ్లి వచ్చి, ఆపై వికారాబాద్ లో తాను నిర్వహిస్తున్న మదార్సాకు వెళ్లాడు. అతనికి కరోనా పాజిటివ్ రాగా, అతని నుంచే, 13 మందికి వ్యాధి సంక్రమించిందని అధికారులు వెల్లడించారు. జిల్లా పరిధిలో ఇటీవల నమోదైన 21 కేసుల్లో 8 మంది మర్కజ్ కు వెళ్లిన వారేనని స్పష్టం చేశారు.

ఇక సూర్యాపేట జిల్లాలో కూరగాయల వ్యాపారం చేసుకునే మరో వ్యక్తి, ఢిల్లీకి వెళ్లి వచ్చి, లాక్ డౌన్ కు ముందు వ్యాపారం నిర్వహించగా, అతని నుంచి 10 మందికి కరోనా సోకింది. వారిలో అతని కుమార్తె కూడా ఉంది. అతని వద్ద నుంచి కూరగాయలు కొన్నవారిని, దగ్గరగా మెలిగిన వారిని అధికారులు ఇప్పుడు క్వారంటైన్ చేస్తున్నారు. కాంటాక్టు కేసులు పెరుగుతూ ఉండటంపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Vikarabad District
Suryapet District
New Cases
Nizamuddin Markaz

More Telugu News