ప్రస్తుత సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతోంది: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

  • వైసీపీ అభ్యర్థులు ఆర్థికసాయం అందజేస్తున్నారంటూ కన్నా ఫిర్యాదు
  • రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం తగదన్న రామకృష్ణ
  • స్వప్రయోజనాల కోసం ప్రచారం చేయరాదన్న ఎస్ఈసీ
ఏపీలో కరోనా సాయం కింద అందజేస్తున్న రూ.1000లను వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా సాయాన్ని కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు.  
స్వప్రయోజనాల కోసం ప్రజల మద్దతు కోరుతున్నట్టు ఫిర్యాదులు అందాయని, ప్రజలకు ఆర్ధిక ప్రయోజనం అందజేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా, సీపీఐ నేత రామకృష్ణ ఈ అంశాలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారని వెల్లడించారు. ప్రస్తుత సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతోందని, పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయిలో అధికారులు దృష్టిసారించాలని అన్నారు. నిజానిజాలను విచారించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

SEC
Nimmagadda Ramesh
Local Body Polls
Kanna Lakshminarayana
CPI Ramakrishna

More Telugu News