న్యాయవాది కిశోర్‌ తలపై కూడా కర్రలతో దాడి: తమపై జరిగిన భయానక దాడిపై స్పందించిన బోండా ఉమ

  • బుద్ధా వెంకన్నతో కలిసి కారులో వెళ్తున్నాను
  • ఆ సమయంలో ఒక్కసారిగా కారుపై పెద్ద రాడ్డుతో దాడి చేశారు
  • మాకు రక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపై దాడి  
  • పోలీసుల వాహనంలోనే మమ్మల్ని తీసుకెళ్లారు 
టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై మాచర్లలో వైసీపీ కార్యకర్తలు భీకర దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మీడియా సమక్షంలో బోండా ఉమతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోనులో మాట్లాడారు. చంద్రబాబుకి బోండా ఉమ దాడి జరిగిన తీరును వివరించారు.

'నిన్న వైసీపీ కార్యకర్తలు అక్కడ నామినేషన్‌ ప్రక్రియను అడ్డుకున్నారని తెలుసుకుని మేము అక్కడకు వెళ్లాము. బుద్ధా వెంకన్నతో కలిసి కారులో వెళ్తున్నాను. ఆ సమయంలో ఒక్కసారిగా కారుపై పెద్ద రాడ్డుతో దాడి చేశారు' అని చెప్పారు.

'న్యాయవాది కిశోర్‌ తలపై కూడా కర్రలతో దాడి చేశారు. మాకు రక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపై దాడి చేశారు. పోలీసుల వాహనంలోనే మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మొదట వైసీపీ కార్యకర్తల నుంచి తప్పించుకుని మార్కాపురం వైపునకు మళ్లి వెళ్లాం. అక్కడ కూడా మళ్లీ అడ్డుకుని దాడికి యత్నించారు' అని బోండా ఉమ తెలిపారు. గన్‌మన్‌పై కూడా దాడి జరిగిందని వివరించారు. ఆయన ఫోనులో తెలుపుతోన్న సమాచారాన్నంతా చంద్రబాబు మీడియాకు వినిపించారు.

Bonda Uma
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News