కేంద్రమంత్రి గడ్కరీ కారుకూ తప్పని జరిమానా!

  • కారు వేగంగా నడిపినందుకు జరిమానా
  • చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న మంత్రి
  • తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఈ చట్టాన్ని తీసుకురావడమేనన్న గడ్కరీ
ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వాహన చట్టం వాహనదారుల్లో గుబులు రేపుతోంది. వేలాది రూపాయల జరిమానాలు చెల్లించలేక వాహనదారులు లబోదిబోమంటున్నారు. కాగా, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికైనా జరిమానా తప్పదని పోలీసులు మరోమారు నిరూపించారు. స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కారుకే జరిమానా విధించారు. ముంబైలోని బాంద్రా-వర్లీ ప్రాంతంలో కారును అతివేగంగా నడిపినందుకు పోలీసులు చలానా పంపారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. మోదీ వంద రోజుల పాలన గురించి వివరిస్తూ ఆయనీ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ప్రమాదాల నివారణ కోసమే మోటారు వాహనాల సవరణల చట్టం తీసుకొచ్చామని, ఇది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. భారీ జరిమానాల వల్ల పారదర్శకత పెరుగుతుందని, అవినీతికి తావుండదని అన్నారు. కారు వేగంగా నడిపినందుకు తాను కూడా జరిమానా కట్టాల్సి వచ్చిందని గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి ఎటువంటి భయం అవసరం లేదన్నారు.
Go Back to Shorts
Nitin Gadkari
Minister
vehicle act

More Telugu News